13, సెప్టెంబర్ 2011, మంగళవారం

కె.బి. తిలక్‌ (K.B.Tilak)

 అనుపమ చిత్రాల ఆణిముత్యం
http://icdn1.indiaglitz.com/telugu/news/Tilak230910_1c.jpgగతంలో సినిమాలను పరిశీలిస్తే ఆయా నిర్మాణ సంస్థలను దర్శకుడ్ని బట్టి ఎంతో మంచి కథతో తయారైనట్టుందని, అదే స్థాయిలో పాటలు కూడా జన రంజకంగా ఉంటాయని ప్రేక్షకులు, పంపిణీ సంస్థలు భావించి వాటి ప్రచారం కోసం ఎంతో కృషి చేసి, చిత్రాల విజయానికి మరింత కృషి చేసేవి. ప్రస్థుతం సినిమా చూడటానికి వెళ్లినా అది పూర్తి అయ్యే లోపలే పేరు కూడా మర్చిపోతున్నాం. ఒకప్పుడు సంగీత పరంగా జానపద కళారూపంగా చిత్రాన్ని తీర్చిదిద్దేవారు. విజయ, వాహిని, అనుపమ, ఎబిఎమ్‌, జెమిని వంటి ఎన్నో సంస్థలు పదికాలాల పాటు గుర్తుండిపోయే చిత్రాలను నిర్మించారు. అందుకే నేటికీ ఆ సంస్థలను వాటి దర్శక నిర్మాతలను స్మరించుకుంటున్నాం.
సినిమా అత్యంత శక్తి వంతమైన ప్రచార మాధ్యమం. దీని ద్వారా సమాజ ప్రగతికి, మానవాభ్యుదాయానికి, సంఘసంస్కరణకు ప్రయత్నించవచ్చని తమ చిత్రాల ద్వారా చాటి చెప్పిన దర్శక నిర్మాతలలో కె.బి.తిలక్‌ పేర్కొనదగినవారు. తాను నమ్మిన సిద్ధాంతాలను కళాత్మకమైన చలన చిత్రాల ద్వారా జన సామాన్యంలోకి తీసుకెళ్లిన ప్రజాదర్శకుడు. సినిమా ఏదైనాకానీ, భాష ఏమైనా కాని, హీరో జగ్గయ్యకానీ, రాజేష్‌ ఖన్నా కానీ, సంజీవ కుమార్‌ కానీ ఆయన సినిమాలలో పాటలు సప్తస్వరాల మాటలు. సాహిత్యం, సంగీతం సమపాళ్లలో మేళవించిన మహాద్భతాలు. ఆరుద్ర, పెండ్యాల ఆయనకు రెండు భుజాలు, ''కొండగాలి తిరిగింది'' వంటి భావగీతం, ''నీ ఆశా అడియాసా'' వంటి విషాద గీతం, ''నమోనమో బాపు'' వంటి ప్రబోధగీతం, ''ఎవరో వస్తారని, ఏదో చేస్తారని వంటి మేల్కొలుపుగీతం, ''అందాలరాముడు ఇందీవరశ్యాముడు'' వంటి జానపద గీతం, ''దాచిన దాగని వలపు'' వంటి విదేశీ ఫక్కీగీతం, ''మాయదారి కీచులాట మామధ్య వచ్చింది'', ''పైలాపైలా పచ్చీసు పరువం లోని లేడీసు'' వంటి నవ్వులు పూయించే గీతాలు, ''అమ్మా చూడాలని ఉంది, నిన్ను చూడాలని ఉంది. వంటి ఆశ్రువులు తెప్పించేగీతం ఇవన్నీ ఆయన రూపకల్పనలే. సరస్వతి గళసీమలో శాశ్వతంగా మెరిసే ఆణిముత్యాలే.
ఆయన మానవతా వాది. ఎక్కడ సాంఘిక దురాచారాలుఉన్నాయో వాటికి వ్యతిరేకంగా పోరాడే వారిలో ఆయన కనిపిస్తాడు. ఆయనో సినిమా మనిషన్నారు మరికొందరు.

ఫిల్మ్‌ రిప్రజెంటేటివ్‌గా జీవితాన్ని ప్రారంభించి ఎడిటింగ్‌లో ఎదిగి ''జ్యోతి'' సినిమాకు అనుకోకుండా దర్శకుడై నిర్మాణ సంస్థను ప్రారంభించి ''ముద్దుబిడ్డ'' తో దర్శకునిగా ఎదిగి పది తెలుగు రెండు హిందీ మూడు ఇతర భాషా చిత్రాలను తీసి సినీ చరిత్రలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ''ఎం.ఎల్‌.ఏ, భూమికోసం'' రాజకీయ చిత్రాలైతే ''అత్తా ఒకింటి కోడలే'' హాస్య చిత్రం, ''ఈడుజోడు, ఉయ్యాలజంపాల'' ప్రేమ చుట్టు తిరిగితే ''పంతాలు పట్టింపులు'' కళ చుట్టూ తిరుగుతుంది. 'చిట్టితమ్ముడు' పసిపిల్లల జీవనం గురించి, 'కొల్లేటికాపురం' పర్యావరణాన్ని దోపిడి చేసే వారిగురించి, ''ధర్మవడ్డీ' సెటిలర్స్‌ సమస్యకు మానవీయ కోణం చూపిస్తుంది.
83 వసంతాల కె.బి.తిలక్‌ జీవనయానంలోని వెలుగునీడలు వారిమాటల్లోనే...
http://www.jointscene.com/ahtees/admin/customer/content/12281_17_KBTilak10.jpg నేను 1926 సంక్రాంతి రోజున పశ్చిమ గోదావరిజిల్లా దెందులూరులో పుట్టాను నా అసలు పేరు మా తాతగారి పేరే. (బాలగంగాధరరావు) 'లోకమాన్యుడి''తో స్కూల్లో చేరినప్పుడు నా పేరు చివర 'తిలక్‌' చేరింది. కొల్లి పరవెంకట సుబ్బమ్మ, వెంకటాద్రి మా అమ్మానాన్న. వృత్తి రీత్యా రైతు అయినా స్వాతంత్య్ర సమరయోధునిగా చుట్టు ప్రక్కల గ్రామాల వారికి నాన్న చిరపరిచుతుడు. మా వూరికి 3 మైళ్ల దూరంలో ఉన్న ఏలూరు మున్సిపల్‌ స్కూల్లో 1930 లో మూడవ ఫారంలో చేరాను. రానుపోను ఆరుమైళ్లు. ముందురోజుల్లో నడక తర్వాత సైకిల్‌ కొన్నారు. చదువు బాగానే వచ్చేది. కాని ఇతర వ్యాపకాలెక్కువ. ఎలిమెంటరీ స్థాయిలోనే టీచరును పెట్టి చదువించేవారు ఇంట్లోనే. 'భక్త ప్రహ్లాద' వంటివి చెప్పేవారు.
స్కూల్లో చదువుకునే రోజుల్లోనే 1942 నాటి 'క్విట్‌ ఇండియా' ఉద్యమం గొప్ప స్ఫూర్తినిచ్చింది. బ్రిటిషు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు 1942 ఆగస్టు, సెప్టెంబరు ప్రాంతాల్లో అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పంపారు. అక్కడి నుండి విడుదలయ్యాక జేబులో చిల్లి గవ్వ లేకపోవడంతో దెందులూరు వరకు నడచి వెళ్లాను.
ఆ తర్వాత 'ఉషామెహతా' స్వతంత్ర రేడియో ఉద్యమంలో పాల్గొని, పేపర్‌ డిస్ట్రిబ్యూషన్‌ పిల్లాడిగా స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని ప్రచారం చేశాను. ముదిగొండ జగ్గన్న శాస్త్రి ప్రోత్సాహంతో 'ప్రజానాట్యమండలి' పట్ల అతివాద కళాకారుల పంథావైపు ఆకర్షితుడనయ్యాను. నాటకాలు వేయటం, వేయించటం, డప్పులు మ్రోగిస్తూ విప్లవగీతాలను ఆలపిస్తూ గ్రామగ్రామాన తిరిగేవాణ్ణి.
క్విట్‌ఇండియా ఉద్యమంలో అరెస్టు అయినపుడు నాతోపాటు మోతే నారాయణరావు, కార్మండి రామమూర్తిని రెండు వారాలపాటు ఏలూరు జైలులో పెట్టారు. అక్కడి సీనియర్‌ పోలీసు అధికారి ''ఎందుకీ కుర్రవాడిని చెడ గొడ్తున్నారు'' అని వాళ్ళను ప్రశ్నించాడు. ''వాళ్ళు చెడగొట్టడం తప్పు, మహాత్మా గాంధీ పిలుపు మేరకు నేనే స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటున్నానని'' ఎదురు జవాబు చెప్పాను.
ప్రజా నాట్యమండలిలో తిరుగుతుండగానే మామేనత్త (ఎల్‌.వి.ప్రసాద్‌ భార్య) తనవెంట బొంబాయి తీసుకువెళ్ళింది. దారిలో బెజవాడలో రైలు మారాలి. అక్కడికి చేరుకోగానే బొంబాయి బైలుదేరాల్సిన రైలు చాలా ఆలస్యం అవుతుందని తెలుసుకుని మొగల్రాజ పురంలో వున్న చండ్ర రాజేశ్వరరావు ఇంటికి పరుగెత్తాను. ఆయన శ్రీపాద అమృత దాంగేకు పరిచయరేఖ వ్రాసి ఇచ్చారు. దీనివల్ల అప్పట్లో బొంబాయిలో ప్రసిద్ధ మైన పీపుల్‌థియేటర్‌ ప్రముఖులు బలరాజ్‌ సహానీ, రమేష్‌ థాపర్‌తో సాన్నిహిత్యం సంపాదించుకోగలిగాను.
మా మేనమామ ఎదురింట్లో ప్రఖ్యాత సినీకళాకారుడు, నేపథ్య గాయకుడు డబ్ల్యు. ఎమ్‌.ఖాన్‌ దగ్గరకొచ్చే సింధీ కమేడియన్‌ గోపితో స్నేహంకుదిరింది. నేను తర్వాతి కాలంలో సినీరంగ ప్రవేశం చేయటానికి గోపి స్నేహం, ఎల్‌.వి. ప్రసాద్‌ ఏకలవ్య శిష్యరికం ఎంతగానో తోడ్పడ్డాయి.
కమ్యూనిస్టుపార్టీ ఆ రోజుల్లో ప్రచురించే ''పీపుల్స్‌ వార్‌'' అనే పత్రికకు పేపర్‌ బాయ్‌గా పనిచేశాను. బొంబాయిలో ఈ పార్టీలో పనిచేసే సెంట్రల్‌ స్క్వాడ్‌కు చెందిన వారంతా ఇలా ఏదో ఒక పార్టీ కార్య కలాపాల్లో పాల్గొనటం అప్పట్లో ఆనవాయితీ. దీనివల్ల కొంచెం పాకెట్‌ మనీ దొరికేది. అయితే కమ్యూనిస్టు పార్టీతో నాకున్న సంబంధాలను, నిత్య ఖర్చు సంపాదించేందుకు చేసే పార్టీ టైము పనులను ఏనాడు మామయ్యకు చెప్పేవాణ్ణి కాదు. ''గృహప్రవేశం'' చిత్రంలో నటిస్తూ దర్శకత్వం వహించడానికి మామయ్య మద్రాసు వెళ్ళిపోయినా నాకున్న ఒప్పుకున్న కార్యకలా పాలను పూర్తిచేయటానికి మరికొద్ది రోజులు ముంబాయిలోనే గడపాల్సి వచ్చింది. సంపాదన అరకొర కావడంతో సరిపోక కె.యల్‌.ఎన్‌.ప్రసాద్‌ (నాటి ''ఆంధ్రజ్యోతి'') సోదరుడు ప్రారంభించిన ''దానామార్‌ డిస్ట్రిబ్యూషన్‌'' కంపెనీలో సేల్స్‌బోయ్‌గా చేరాను. కొన్నాళ్ళకు నేను మద్రాసు చేరుకుని ''మోడల్‌ ప్రొడక్షన్స్‌'' వారి పంపిణీసంస్థలో ''ప్రీమియర్‌ ఫిల్మ్స్‌'' తరపున రిప్రజంటేటివ్‌గా కొత్త అవతారం ఎత్తాను. ఇది సినీ ప్రస్థానానికి ఒక విధంగా నాంది అని చెప్పవచ్చు. నా అభిరుచులకు, ఆశయాలకు అనుకూలంగావున్న సినీ ఎడిటర్‌ ఎం.వి.రాజన్‌తో సన్నిహితత్వం ఏర్పడ్డది. ఎల్‌.వి.ప్రసాద్‌ నటించిన ''గృహప్రవేశం'' చిత్రానికి ఆయనే ఎడిటర్‌. హెచ్‌.ఎం.రెడ్డి వంటి ఉద్దండుడితో కలిసి పనిచేసినవాడు వీరి సహాయంతో ఎలాగైనా ఎడిటింగ్‌ లైన్‌లోకి వెళ్ళాలని నా తాపత్రయం.
తెలంగాణా విమోచనోద్యమం ఊపందుకుంటున్న రోజుల్లో కమ్యూనిస్టు పార్టీతోపాటు ప్రజా నాట్యమండలిపైనా నిషేధం విధించడంతో దీని తాలూకు రచయితలు ఒక్కొక్కరే మద్రాసు రావడం జరిగింది. తొలినుండి ఉద్యమంతో సంబంధం లేకపోయినా ఎల్‌.వి. కళాకారులకు ఆసరాగా వుండేవారు. ఆయనది మొదటినుంచి ''ప్రొఫెసర్‌ మోటివేషనే'' సామాజిక స్పందన సినిమాలకే పరిమితం. విశేషం ఏమంటే ఆయన కొన్నాళ్ళు ఆంధ్రప్రజానాట్యమండలికి అధ్యక్షుడిగా కూడ పనిచేశారు.
మేడమ్‌ఎక్స్‌ నవల ఆధారంగా 'శ్రీమతి' అనే సినిమా తీయాలనుకున్నారు సారధి వారు. అప్పట్లో ఈ చిత్రానికి ఎంపిక చేసిన ఎన్‌.టి.ఆర్‌కు మూవీటెస్ట్‌ చేసిన వారిలో నేను ఒకడిని.
సహకార ఉద్యమం ప్రధాన ఇతి వృత్తంగా తీసిన ''అంతా మన వాళ్ళే'' చిత్రానికి ఎడిటర్‌గా చేశాను. ఇది మరో అధ్యాయానికి ప్రారంభంలో తెలంగాణ ఉద్యమ ప్రభావాన్ని, బంజరు భూముల సమస్య ప్రధాన ఇతివృత్తంగా వచ్చిన ''రోజులుమారాయి'' చిత్రం నిజంగానే నా రోజులను పూర్తిగా మార్చేసింది. దీనికి ఎడిటర్‌గా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ఈ రంగంలో నిలదొక్కుకో గలిగాను.
నేను, రాజన్‌ ఎడిటర్స్‌గా ''మంత్రదండం'' (అక్కినేని, జూనియర్‌ శ్రీరంజని), ''సువర్ణమాల'', 'రాధిక', 'ధర్మాంగద' చిత్రాలకు చేశాం.
నాకు భోజనానికి ఇబ్బంది లేకుండా గడిచేది జీతాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించేవాడిని కాదు.
మేమిద్దరం సంయుక్త ఎడిటర్లుగా ''జ్యోతి'' చిత్రాన్ని ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో నిర్మించారు. అందులో ''పదువురు కలిసి పనిచేయరే''..అనే పాట చిత్రీకరణ ఒక స్కూలుకు పాక వేయాలి. ఎడిటర్‌గా వున్న అనుభవంతో ఆ సన్నివేశాన్ని రివర్స్‌లో ''పాకను పీకటంతో చిత్రీకరణ చేశాను.
దర్శకత్వం ప్రారంభించాక అక్షరాస్యత ప్రాముఖ్యతను చాటుతూ ఒక పాటను చిత్రించాను. దీనిలో పాల్గొన్న వారందరూ నాటి మద్రాసు బాలానంద సభ్యులే. ఆ పాట అభినయించిన బాలనటి నిడదవోలు వెంకటరావు కుమార్తె మేటి నటి జయసుధ తల్లి శ్రీమతి జోగమాంబ. దర్శకులు కె.ఎస్‌.ప్రకాశరావు ఒక సంస్థ అని చెప్పచ్చు. ''దీక్ష'' సినిమా తీసే ముందు రచయిత ఆరుద్రను కలకత్తా పంపి శరత్‌బాబు నవల ఆధారంగా రెండు స్క్రిప్టులు తయారు చేయించారు, అందులో ''ముద్దుబిడ్డ'' చిత్రాన్ని నేను తీశాను. అప్పట్లో ''ప్రభాత్‌ ఫిల్మ్స్‌'' అనే పంపిణీ సంస్థను ప్రారంభిచాను. నిజాం ప్రాంతంలో నవయుగ ఫిల్మ్స్‌ ''ముద్దుబిడ్డ'' చిత్రానికి ప్రప్రధమంగా పంపిణీ సంస్థగా వ్యవహరించింది. అప్పటికే ''పుట్టిల్లు'' చిత్రంలో నటిస్తున్న జమున ఈ చిత్రంలో హీరోయిన్‌. భారతదేశం మొత్తం మీద ఎత్తయిన ఎవరెస్టు శిఖరం దానిపై నక్షత్రం గుర్తుగా ''అనుపమ'' బ్యానర్‌ అందరికి సుపరిచితమే దీనికి మరోకటి సాటి లేదు-రాదు అనే లక్ష్యంతో డిజైన్‌ చేశాం. దీని క్రింద పలుచిత్రాలకు దర్శక నిర్మాతగా వున్నాను. ఈ సినిమాతో ప్రారంభమైన ఆరుద్ర, పెండ్యాల కాంబినేషన్‌ ''అనుపమ''కు హాల్‌ మార్క్‌ గా అయింది.
ఈ చిత్రంలో జ్యోతి అనే కొత్త నృత్యతారను పరిచయం చేశాను. ఆవిడే పాపులర్‌ హీరో సాయికుమార్‌ తల్లి.
ఇందులో ఆరుద్ర రాసిన ''అమ్మాచూడాలని వుంది, నిన్ను చూడాలని వుంది'' అనే రికార్డింగ్‌ జరుగుతున్నప్పుడు జలుబుగొంతుతో ఎలా పాడతాను అన్నది సుశీల. అలాగే పాడండి అని ప్రోత్సాహించాను. అన్నిట్లోకి ఆ పాటే బాగావచ్చింది.
భూసంస్కరణలు, దున్నేవాడిదే భూమి వంటి నినాదాలతో రూపుదిదద్దుకున్న 'సినిమా'ఎమ్మెల్యే (1957) చిత్రీకరణ ఎక్కువ జేట్‌డోరిలో జరిగింది. 'బ్యాక్‌సీట్‌ డ్రైవింగ్‌ బంతి వడ్డన రాజకీయాలు ఈ సినిమా ప్రధాన కథ. సంపన్న వర్గం వారి రాజకీయంతో గెలిచినా ప్రజల్లోంచి వచ్చినవారు చివరికి వారికి అనుకూలంగానే వ్యవహరించడమే ఇందులో 'ఎమ్మెల్యే' చేస్తాడు.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhnOxY4vdcG_1cJvq1n9ITHBGxnihZj6ASwFH1ooOxJyYeEqSoYvpuqIfHWfvfOwMx7KgDGiOlbEmY-4161KwVxDModP-Xvv9KKuqAbVoEXuqcddxIQB1VB1zC9O_ER5S_z3Lq7Zj0C6-0/s1600/kb-tilak.jpg
నటుడు జె.వి.రమణమూర్తిని, నేపథ్యగాయిని ఎస్‌.జానకిని ప్రధమంగా పరిచయం చేశాను. ఘంటసాల, జానకి పాడిన ''నీ ఆశ అడియాస చేజారే మణిపూస''...ఆ తరంలో విననివారు ఎవరూవుండరనటం అతిశయోక్తి కాదేమో!, దీన్ని రికార్డు చేస్తున్నప్పుడు పల్లవంతా నాకే ఇవ్వరాదా అని అడిగారు ఘంటసాల. పలనాడులో క్రైస్తవ మిషనరీ వారు ప్రచారం కోసం పాడుకునే జానపదగీతం ఈపాటకు స్ఫూర్తి.
ఆంధ్రప్రదేశ్‌లో భూసంస్కరణల చట్టం తేవాలన్న ఆలోచన ప్రభుత్వానికి కలగటానికి ముందే ఈ అంశాన్ని సినిమాలో ఎంచుకున్నాను. సెప్టెంబరు 19, 1957లో విడుదల కాగా 1958లో చట్టంచేశారు.
ఇందులో ఎమ్మెల్యే దాసు (జగ్గయ్య) పోటీ చేసి గెలిచిన ఎన్నికల చిహ్నం ఆవు-దూడ. చాలా ఏళ్ళకు (1971) కాంగ్రెస్‌ ఎంచుకున్న చిహ్నంగా కూడా ఇదేకావడం విశేషం. ఒంగోలు ఎం.పిగా జగ్గయ్య, మరో సినీ కళాకారుడు కోన ప్రభాకరరావు ఎం.ఎల్‌.ఏగా గెలుపొందారు.
''బరంపురం కోల్లాడి'' అనే ఒరియానాటకంలోని ఒక సన్నివేశం ఆధారంగా ''అత్తా ఒకింటి కోడలే'' తీశాను. సోమర్‌ సెట్‌మామ్‌ కథ ''మదర్‌'' ప్రభావం ఈ చిత్రంపై వుంది. మన సంసారాల్లో అత్తా-కోడళ్ళు ఎందుకు కలవరంటే స్త్రీది ''సొసెసిల్‌ నేచర్‌ కావటమే'' కారణం.
ఎవ్వరు ఏ సినిమాకు చేయని రీతిలో ప్రచారం చేశాను. ఆరుద్ర-బాపు-రమణకాంబినేషన్‌లో ఈ సిన్మానుబొమ్మలకథగా ''ఆంధ్రపత్రిక''లో వేయించాం. వారం, వారం సినిమాకథ ఆ సాంతం ద్విపదలో వ్రాయించి పబ్లిసిటీ చేశాం. ఆరుద్ర సామెతలు వ్రాసేవారు. అప్పటికే మంచి ఆర్టిస్ట్‌గా, రచయితగా పేరు తెచ్చుకున్న బాపు, రమణలు సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఈ చిత్రంలో బొమ్మల కథ ద్వారానే జానపద గీతాలను ప్రవేశపెట్టిన తొలిసిన్మా. మద్రాస్‌ సిస్టర్స్‌ శశి-కళ డ్యాన్సర్లుగా పరిచయం చేశాను. ఆరుద్ర పాటలు ఒక ఎత్తు అయితే స్క్రిప్టు ఆయనకు ఎంతో పేరుతెచ్చింది.
స్టూవర్ట్‌పురం సెటిల్‌మెంట్‌ థీమ్‌, ఆలివర్‌ట్విస్ట్‌ ఆంగ్లనవల ఆధారంగా 1962లో 'చిట్టితమ్ముడు' తీశాను. అలాగే స్టూవర్ట్‌ పురం సెటిలర్స్‌ జీవితాలపై ''కారు చీకట్లో కాంతిరేఖ'' అనే డాక్యుమెంటరీ తీశాను. దీన్ని చూసిన ఢిల్లిd దూరదర్శన్‌ అధికారి హరీష్‌ ఖన్నా ఎంతో మెచ్చుకున్నారు. నేను తీయాలనుకున్న శ్రీకృష్ణార్జున, నరనారాయణులు, ఉత్తరనగ్రహణం, భీమసేన వేరేపేర్లతో వచ్చినా విజయవంతం కావడం నాకెంతో తృప్తినిచ్చే విషయం.
'చిట్టితమ్ముడు' చిత్రంలో విజయలలితను బాటనటిగా పరిచయం చేశాను. అలాగే అత్తా ఒకింటి కోడలే చిత్రంలో విజయశాంతి పిన్ని విజయతో నర్సువేషం వేయించాను.
ఇష్టంలేని వివాహం రద్దు చేసుకుని కోరుకున్న వాణ్ణిపెళ్ళి చేసుకోవడం ఇతివృత్తంగా ఒక సామాజిక స్పృహతో శరత్‌బాబు నవల ఆధారంగా ''ఈడూ-జోడూ(1963) తీశాను ఇందులో మణిమాల అనే నూతన నటిని పరిచయం చేశాను. ఇది ఆర్థికంగా విజయం సాధించకపోయినా అందరి ప్రశంసలు అందుకుంది.
ఓ పోయె పోయె చినదానా..లాంటి పాటలు, అందులోని కొన్ని చరణాలు గుర్తు చేసుకొని పాత కాలంనాటి సినీ ప్రేక్షకులుండరంటే అతిశయోక్తి కాదేమో, సాదాసీదా కుటుంబకథా ఆధారంగా మృదుమధురమైన పాటల ఆసరాతో అందరి మన్ననలు అందుకుంది. రాజకీయాల్లోవున్న కోన ప్రభాకరరావుతో ఇందులో వేషం వేయించాను. అప్పటి దాకా శాస్త్రీయ సంగీతానికే పరిమితమైన బాల మురళీకృష్ణతో ''ఏటిలోని కెరటాలు ఏరువిడిచిపోవు..అనే పాటపాడించాను.
మరాఠీ 'తమాషా'ల (పెద్దాపురం మోజు వాణితరహా అనిచెప్పచ్చు) ఇతివృత్తంతో 'పంతాలు-పట్టింపులు' (1968) సిన్మాను శంభుఫిల్మ్‌ వారికి చేశాను.
1971లో 'ముద్దుబిడ్డ' హిందీలో 'ఛోటీబభు'గా 'ఈడూజోడూ సిన్మా 'కంగన్‌'గానూ వచ్చాయి. ఇవి బాక్సాఫీసు దగ్గర విజయవంతంకాకపోవచ్చు. అయితే హిందీ చిత్రాలకు దర్శకత్వం చేయమని ఎన్నో ఆఫర్సు వచ్చాయి.
బాహ్య ప్రపంచంలో 'జమిందార్‌' వ్యవస్థ దోపిడీ ఎలా చేస్తోందో అలా కొల్లేరు ప్రాంతంలో 'ఇంజన్‌దార్‌' వ్యవస్థ పెత్తనం చెలాయించేది. దీన్ని ఇతివృత్తంగా ''కొల్లేటి కాపురం' (1976)లో తీశాను. గోపిచంద్‌ వ్రాసిన 'గోడ మీద మూడో వాడు' కథ ఆధారంగా 'ధర్మవడ్డీ' తీశాను. గోపీచంద్‌ కొడుకు సాయిచంద్‌ ఇందులో నటించాడు.
ఆనాటి సిన్మాలో సంగీత పరంగా- జానపద కళల ద్వారా చెప్పదలచుకున్నది అద్భుతంగా తెలియ చెప్పేవాళ్ళం. కథ స్వభావానికి, నడకకి, పాత్ర ప్రాధాన్యతకు తగ్గట్టు పాటలకు రూపొందించేవాళ్ళం. నేపథ్య గీతాల ద్వారా జరగబోయే కథను సూచించే అవకాశం ఎక్కువగా వుండేది. అందుకే వినోదం కూడా పాటల ద్వారానే వస్తుంది. అయితే ఇది ప్రజాప్రయోజనం కలిగించేలా వుండాలి. ఇటీవల 'ఆయం' చిత్రంలో కుటుంబ యజమాని' రాజయ్యగా నటించాను.
ఇప్పటి సిన్మాల్లోకి వస్తున్న యువతీ యువకుల్లో శక్తి సామర్ధ్యాలున్నా సొసైటీలో ఎప్పుడూ త్వరగా డబ్బుచేసుకుందామా అనే ఆలోచనే ఎక్కువగా కనిపిస్తోంది. మాజీవితాలు తెచిరిన పుస్తకాలు, రహస్యాలు వుండేవి కాదు. ఎవరైనా మంచి పనిచేస్తే ఎంతగానో ప్రోత్సహించేవాళ్ళం. ఇలాంటివి ఒకరికి ఒకరం చెప్పుకుని సహకరించేవాళ్ళం.
రాసికంటే వాసిగల చిత్రాలు తీశాను. ఇప్పటి సిన్మాల విషయానికి వస్తే నేటితరం మనుషుల ఆలోచనలను బట్టే చిత్రాలు కూడా వస్తున్నాయనిపిస్తుందన్నారు. కె.బి. తిలక్‌.
'మనదేశంలో వున్నన్ని జీవనదులు మరే దేశంలోనూ లేవు. అలాగే ఖనిజ సంపద, పశుసంపద కూడా, కాని మన దేశంలోవున్నన్ని ఆకలి చావులు, ఆత్మహత్యలూ మరే దేశంలోనూ లేవు. ఇది నిష్టుర సత్యం నేడు వచ్చే సిన్మాలు కూడా ఇలాంటి సమస్యలపై తమ దృష్టిని సారించాల్సిన అవసరం ఎంతైనా వుంది. అప్పుడే 'కళ' కరెన్సీ కోసం కాదు, ప్రజలకోసం అని ప్రతి ప్రేక్షకుడు ఆనంద పడేరోజు వస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి