మానవజాతి తొలినాళ్ళలో ఏర్పరచుకున్న నీతి నియమాలు, విలువల్ని జానపద సాహిత్యం ప్రతిబింబిస్తుంది. చరిత్ర క్రమంలో సమాజం ఎన్ని మార్పులకు గురైనా ప్రాథమిక విలువలు మాత్రం దాదాపు అవే కొనసాగుతుంటాయి. విలువల్ని ఉల్లంఘించేవారు సహితం విలువల్ని గౌరవించడం మనుషులకున్న ఒక మంచి లక్షణం. అబద్ధాలకోరులు, తాగుబోతులు, లంచగొండ్లు, దొంగలు, వృత్తి వ్యభిచారులు సహితం వాటిని ఒక విలువగా చెప్పుకోరు! అందువల్లే విలువల్ని ప్రబోధించే పురాణాలు, జానపద సాహిత్యమంటే అందరూ ఆసక్తి చూపిస్తారు. అందువల్లే వాటికి ఎప్పటికీ తరగని ఈ క్రేజ్! ఈ కారణం చేతనే పురాణ సాహిత్యాన్ని మానవజాతి బాల్యం అన్నవారూ ఉన్నారు.
జానపద అంశ లేకుండా కథను జనంలోనికి చొప్పించడం, ఒప్పించడం, మెప్పించడం అంత సులువు కాదు. సంస్కృతీ సాంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే భారతీయ ప్రేక్షకుల్ని మెప్పించాలంటే జానపద అంశ మరీ అవసరం. అయితే టాలీవుడ్, బాలీవుడ్లోనే కాదు, హాలీవుడ్లో సహితం ఈ నియమమే పనిచేస్తుంది.
'తాటకి సంహారం' అనే కథను పది వాక్యాల్లో రాయమంటే ఎవరైనా ఏం రాస్తారు?
1. అడవిలో విశ్వామిత్రుని యాగాన్ని తాటకి అనే రాక్షసి పాడుచేస్తూ ఉంటుంది.
2. విశ్వామిత్రుడు రుషి కనుక తనంతట తాను తాటకిని చంపలేడు.
3. విశ్వామిత్రుడు రాజధానికి వెళ్ళి దశరథుని సహాయం కోరతాడు.
4. సరేనని కోరినంత సైన్యాన్ని అడవికి పంపిస్తానంటాడు దశరథుడు.
5. అక్కర్లేదు, రామలక్ష్మణుల్ని తన వెంట పంపమంటాడు విశ్వామిత్రుడు.
6. సైన్యం వల్ల కానిది ఇద్దరు పసిబాలురు చేస్తారా అని సందేహం వస్తుంది రాజుకి.
7. విశ్వామిత్రుడు మాత్రం తనకు రామలక్ష్మణులే కావాలని పట్టుబడతాడు.
8. విశ్వామిత్రుని వెంట వెళ్ళిన రామలక్ష్మణులు అడవిలో తాటకిని సంహరిస్తారు.
9. రాక్షసుల బారి నుండి సాధువుల్ని రక్షించి, లోకకల్యాణాన్ని సాధిస్తాడు రాముడు.
10. అయోధ్యకు తిరిగి వస్తూ స్వయంవరంలో సీతను పెళ్ళాడతాడు రాముడు.
దీన్నే 'గబ్బర్ సంహారం'గా మార్చేశారు షోలే స్క్రిప్టు రచయితలు సలీమ్ ఖాన్-జావేద్ అఖ్తర్. వాళ్ళ 'గబ్బర్ సంహారం' కథ ఇలా సాగుతుంది :
1. చంబల్లో ఠాకూర్ కుటుంబాన్ని గబ్బర్ అనే బందిపోటు హతమారుస్తాడు.
2. ఠాకూర్ అవిటివాడు కనుక గబ్బర్ను తనంతట తానుగా అతను అంతం చేయలేడు.
3. నగరానికి వెళ్ళి పోలీసాఫీసరైన పాతమిత్రుడి సహాయం కోరతాడు ఠాకూర్.
4. కావాలంటే ఓ పోలీసు బెటాలియన్ని పంపిస్తానంటాడు ఆ పోలీసాఫీసర్.
5. తన పనికి వీరూ, జయ్ అనే ఇద్దరు దొంగలు చాలు, వాళ్ళని పంపమంటాడు ఠాకూర్.
6. పోలీసులు చేయలేని పనిని ఇద్దరు దొంగలు ఎలా చేస్తారని ఆఫీసరు సందేహం.
7. అయినా సరే గబ్బర్ను చంపడానికి వీరూ, జయ్లే కావాలని పట్టుపడతాడు ఠాకూర్.
8. ఠాకూర్ కోరిక మేరకు చంబల్ లోయలో గబ్బర్ను చంపుతారు వీరూ, జయ్.
9. ఠాకూర్ పగ తీరడంతో పాటు రామ్గఢ్ వాసులకు గబ్బర్ పీడ వదులుతుంది.
10. రామ్గఢ్లో బసంతిని పెళ్లి చేసుకుని నగరానికి తిరిగి వస్తాడు వీరూ.
విదేశాల్లోనూ ఇవే కథలు
రాముడు-కృష్ణుడు
హిడింబాసురుడి చెల్లెల్ని భీముడు, వనకన్య ఉలూచిని అర్జునుడు, జాంబవంతుని కూతుర్ని శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్నట్టు మన పురాణాల్లో ఉంది. పురాణ పురుషుడు శ్రీరాముడు వనవాసకాలంలో ఆదివాసుల సమస్యల్ని పరిష్కరించి, వాళ్ళను తన భక్తులుగా మార్చుకున్నట్టు, చివరకు వానరసైన్యంతోనే లంకను జయించినట్టు రామాయణంలో ఉంది. శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడు కనుక ఆదివాసీ స్త్రీని పెళ్ళి చేసుకోలేదు. కాని పురాణాల ప్రకారం శ్రీరాముని కొనసాగింపే శ్రీకృష్ణుడు కనుక శ్రీరాముని పోరాటం, శ్రీకృష్ణుడు-జాంబవతిల వివాహం కలిపితే (మిక్స్ చేస్తే) అవతార్ హీరో ఆవిర్భవిస్తాడు. దండకారణ్యం 'పండారా' గ్రహంగా మారిపోతుంది. వానరుల తోకలు, నీలం రంగు మనుషులు చివరకు అవతార్ అనే సినిమా టైటిల్ను కూడా జేమ్స్ కామెరూన్ రామాయణ భారతాల నుండి ఎత్తేశాడు. ఇంతటి బలమైన జానపద అంశం ఉండబట్టే, అవతార్ సినిమా ప్రపంచ ప్రేక్షకుల్ని అంతలా ఆకర్షించింది.
అల్లావుద్దీన్, 'టెర్మినేటర్-టూ'
టెర్మినేటర్-టూ కథని అరేబియన్ నైట్స్లోని అల్లావుద్దీన్ అద్భుత దీపం నుండి తీసుకున్నారు. జానపద జిన్ పాత్ర కాస్తా టెర్మినేటర్-టూలో ఆర్నాల్డ్ ష్వాజ్నెగ్గర్గా ఎలా మారాడో చూద్దాం.
1. అల్లావుద్దీన్ తల్లిదండ్రులు అతని చిన్నతనంలోనే చనిపోయారు.
* జాన్ కానర్కు కూడా తండ్రి చనిపోయాడు, తల్లి పిచ్చాసుపత్రిలో ఉంది.
2. అల్లావుద్దీన్ అమ్మమ్మ దగ్గర పెరుగుతాడు.
* జాన్ తన తల్లి స్నేహితురాలింట్లో పెరుగుతాడు.
3. అల్లావుద్దీన్కు ఆటలమీద తప్ప పనిపాటల మీద శ్రద్ధ లేదు.
* జాన్కు కంప్యూటర్ గేమ్స్ మీద తప్ప చదువు మీద శ్రద్ధ లేదు.
4. ఓ రోజు సముద్రపు ఒడ్డున దొరికిన ఓ దీపాన్ని రుద్దితే అల్లావుద్దీన్కు ఓ భూతం ప్రత్యక్షమవుతుంది.
* ఓ రోజు పోలీసులు తరుముతుంటే జాన్ను కాపాడడానికి జిన్ లాంటి ఓ భారీకాయుడు ప్రత్యక్షమవుతాడు.
5. నువ్వే నా యజమాని, ఇక నువ్వు చెప్పిందల్లా చేయడమే నా పని అంటాడు జిన్.
* నువ్వే నన్ను సృష్టించావు. నిన్ను కాపాడడమే నా పని అంటుంది ఆ భారీ కాయం.
6. ఆ తరువాత అల్లావుద్దీన్ జీవితం మారిపోతుంది. అతను ఆ రాజ్యంలోనే గొప్పవాడైపోతాడు.
* జాన్ కానర్ అణుయుద్ధం నుండి ప్రపంచాన్ని కాపాడే సైంటిస్ట్ అవుతాడు.
మొత్తం కథలు డజనున్నరే!
మనుషులందరి శరీర నిర్మాణం దాదాపు ఒకేలా ఉంటుంది. శరీర ధర్మ శాస్త్రవేత్తల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా డజనో, డజనున్నరో రకాల ఆదిమానవ జాతులు మాత్రమే ఉన్నాయి. నీగ్రోలాయిడ్, ఆస్ట్రోలాయిడ్, పీకింగ్ కేవ్ మ్యాన్, రామా పితికస్ వంటివి అన్నమాట. వాటిమీద ఆధారపడి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల కోట్ల జనాభా వర్థిల్లుతుంటుంది. శరీర నిర్మాణం ఒకటైనంత మాత్రాన మనుషులందరూ ఒక్కలాగే ఉండరు. ప్రతి మనిషి స్వరూపంలోనూ, స్వభావంలోనూ తనదైన వైవిధ్యం ఉంటుంది. సృజనాత్మక రచన కూడా అంతే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జానపద సాహిత్యాన్ని పరిశీలిస్తే డజనో, డజనున్నరో మూల కథలు మాత్రమే కనిపిస్తాయి. వాటిని పునాదిగా చేసుకుని కొన్ని వేల, లక్షల కథలు పుట్టుకొస్తాయి. మూల కథను తీసుకుని కొత్త వాతావరణంలో, కొత్త పాత్రల మధ్య, వైవిధ్య పూరితంగా, సృజనాత్మకంగా చెప్పడమే రచయితల నైపుణ్యం. ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే, అస్థిపంజరమే లేకుంటే మనిషి కుప్పకూలిపోయినట్టు, జానపద అంశాన్ని మర్చిపోతే మొత్తం కథ కుప్పకూలిపోతుంది.
పురాణ స్థాయి
షోలే సినిమాలో మూల కథ, భావోద్వేగాలు, కొత్త సన్నివేశాలు, అన్నీ పరిపూర్ణంగా అమిరాయి. ఆ సినిమాలోని కాలియా, సాంబా వంటి చిన్న చిన్న పాత్రలు, వారి సంభాషణలు సహితం మనకు ఇప్పటికీ గుర్తున్నాయంటే ఆ సన్నివేశాలు అంతటి భావోద్వేగాలతో నిండి ఉండడమే కారణం.
మూలకథ, భావోద్వేగాలు, సరికొత్త వాతావరణం వీటితో పాటు నాల్గవ అంశంగా ఒక కొత్త చలనశీలత కథలో అమరాలి. షోలే సినిమాలో ప్రతి నాయకుడికి వ్యతిరేకంగా ప్రధాన పాత్రలన్నీ మొక్కవోని పట్టుదలతో బతుకు పోరాటం చేస్తుంటాయి. ఆ సినిమాకు అసలు థీమ్ అదే!
కిరాయి హంతకులే అయినా ఎంతటి ఉపద్రవాన్నయినా ఎదుర్కొనగల సాహసికులు అందులోని హీరోలిద్దరూ.
పైగా స్నేహం కోసం ప్రాణమిచ్చే మనుషులు వాళ్లు.
రెండు చేతులూ లేకపోయినా సరే, బందిపోటు గబ్బర్ను అంతం చేయడమే జీవిత పరమావధిగా పెట్టుకున్న ఒక ఠాకూర్;
ఇంట్లో మగదిక్కు లేకున్నా, జట్కాబండి తోలి కుటుంబాన్ని పోషించే ఓ కథానాయకి;
భర్త చనిపోయినా మెట్టినింటి బాధ్యతల్ని నిర్వర్తించే ఓ పెద్దింటి కోడలు;
వయసులో ఉన్న కొడుకును బందిపోటు చంపేస్తే, పుట్టిన ఊరి కోసం బలివ్వడానికి తనకు మరో నలుగురు కొడుకుల్ని ఎందుకు ఇవ్వలేదని దేవుణ్ణి అడిగే ఓ ముసలి తండ్రి;
వయసొచ్చిన పిల్లను ఓ మంచివాడి చేతిలో పెట్టి కన్ను మూయాలనుకునే ఓ బామ్మ;
బా«ధేస్తే భోరున ఏడ్వడం, ఆనందం వస్తే గలగల నవ్వడం, ఉత్సాహం వస్తే సంబరాలు జరుపుకోవడం తెలిసిన గ్రామ ప్రజలు;
దొంగల్ని తనే ప్రభుత్వానికి పట్టించానని బడాయికి పోయే కట్టెల వ్యాపారి;
తను ఆంగ్లేయుల కాలం నాటి అధికారినని గొప్పలు చెప్పుకునే జైలరు;
- ఇలా ఎన్నో సజీవ పాత్రలు. ఇవన్నీ ఒక ఎత్తయితే, తన వాళ్లనయినా చంపడానికి వెనుకాడని క్రూరుడైన బందిపోటు నాయకుడు ఇంకో ఎత్తు. ఇన్ని అమరినపుడు సహజంగానే ఒక కథ పురాణంగా మారిపోతుంది. దానికి ఎపిక్ స్టేటస్ వచ్చేస్తుంది. షోలే, అవతార్ విషయంలో జరిగింది ఇదే.
జానపద కథల్లో సౌలభ్యం
వర్తమానం-గతం-వర్తమానం
పండారా గ్రహంలో దొరికే ప్రత్యేకమైన ఖనిజం కోసం దాడి చేసిన భూగ్రహవాసుల్ని అక్కడి మనుషులు, జంతువులు, పక్షులు కలిసి తిప్పికొట్టడం అవతార్ కథ. అంటే దండకారణ్యాన్ని జేమ్స్ కామెరూన్ రామాయణ కాలం నుండే కాకుండా వర్తమానం నుండి కూడా తీసుకున్నాడని అర్థమవుతోంది. వర్తమానం అంటే అది కచ్చితంగా దండకారణ్యమే కానక్కర లేదు. సహజసంపదపై ఆధిపత్యం కోసం సామ్రాజ్యవాద దేశాలు దాడులు చేయడం ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్నదే. తమ ప్రాంతపు సహజ సంపదనీ, సాంప్రదాయాల్నీ పరిరక్షించుకోడానికి స్థానికులు, మరీ ముఖ్యంగా ఆదివాసులు, ప్రాణాలను ఒడ్డి నాగరిక సమాజంతో పోరాడడం కూడా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నదే. దీనికి ఆధునిక రూపమే గల్ఫ్ వార్! గల్ఫ్లో అమెరికా యుద్ధ నేరాలకు పాల్పడిందని విమర్శించే మానవహక్కుల నేతలు అమెరికాలోనూ లేకపోలేదు. అలాంటి వాళ్ల ప్రేరణ నుండి కూడా అవతార్ హీరో ఆవిర్భవించి ఉండవచ్చు.
దండకారణ్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రస్తుతం ఆంధ్రప్రదే శ్, ఒరిస్సా, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో పెద్దయెత్తున ఆందోళన సాగుతోంది. ఇటీవల అక్కడి ఉద్యమకారులు పండారా గ్రహవాసుల్లా నీలం రంగు పూసుకుని, తోకలు పెట్టుకుని సింబాలిక్ ఆందోళన కూడా చేశారు. దండకారణ్యం అవతార్ సినిమాకు ప్రేరణగా నిలిస్తే, అవతార్ సినిమా దండకారణ్యం పరిరక్షణ ఆందోళనకారులకు ప్రేరణగా మారింది. సమాజం నుండి ప్రేరణ పొందిన సినిమా, తిరిగి సమాజానికి ప్రేరణ ఇవ్వడం అంటే ఇదే! అంతకన్నా పరమార్థం సినిమాకు మరేదీ ఉండదు!
source: andrajyothi
* ఎ.ఎం. ఖాన్ యజ్దానీ (డానీ)
రచయిత సెల్: 90102 34336
* ఎ.ఎం. ఖాన్ యజ్దానీ (డానీ)
రచయిత సెల్: 90102 34336
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి